text: ప్రకాశం జిల్లా రామకృష్ణాపురానికి చెందిన ఓ వ్యక్తి తన నాలుగేళ్ల కుమారుడిని ఇటీవల సూర్యాపేట జిల్లా మిట్టపల్లిలోని తన మామ గారింటికి పంపారు. మామకు గుండె నొప్పి రావడంతో బంధువులు ఆయనను గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. రామకృష్ణాపురంలో ఉంటున్న ఆయన అల్లుడు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి... చీరాల నుంచి గుంటూరు వెళ్లారు. ఆసుపత్రి వద్ద ఉన్న తన కుమారుడిని తీసుకుని స్వగ్రామానికి వచ్చారు. కరోనా విషయాన్ని ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచారు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని 188, 269, 270 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. తెలంగాణలో 74 లక్షల కుటుంబాలకు రూ.1,500 చొప్పున నగదు పంపిణీ లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి రూ.1500 చొప్పున పంపిణీ చేయనుందని, మంగళవారం ఈ ప్రక్రియ మొదలవుతుందని 'నమస్తే తెలంగాణ' దినపత్రిక వార్త రాసింది. రేషన్‌ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి రూ.1500 చొప్పున ప్రభుత్వం అందజేయనుంది. ఇందుకోసం రూ.1,112 కోట్ల నిధులను కేటాయించింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకులకు బదిలీ చేసిందని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం ట్విటర్‌లో తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు 74 లక్షల కుటుంబాలకు మంగళవారం నుంచి నగదు పంపిణీ చేయనున్నారు. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే రూ.1500 చొప్పున డబ్బు జమ అవుతుంది.ఆధార్‌ కార్డులోని వివరాల ఆధారంగా పౌర సరఫరాల శాఖ ఇప్పటికే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల సమాచారాన్ని సేకరించింది. ఏపీలో టెలీ వైద్యం కోవిడ్‌-19 నివారణ చర్యల్లో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ టెలి మెడిసిన్‌ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని 'సాక్షి' దినపత్రిక ఓ వార్త రాసింది. టెలీ మెడిసిన్ కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. టెలీ మెడిసిన్ సేవల కోసం కేటాయించిన 14410 నెంబర్‌కు ఫోన్‌ చేసి డాక్టర్‌తో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా, బలోపేతంగా నడపాలని అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్యనూ పెంచాలని చెప్పారు. 14410 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్ గానీ, మిస్డ్‌ కాల్‌ గానీ చేసి ప్రజలు ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. ఫోన్ చేసినవారు ఉంటున్న ప్రదేశం, వయసు, రోగ లక్షణాల వంటి వివరాలను టెలీ మెడిసిన్ ఎగ్జిక్యూటివ్స్ తెలుసుకుంటారు. రోగికి ఒక గుర్తింపు సంఖ్య ఇస్తారు. రోగి వివరాలన్నీ టెలి మెడిసిన్‌ వ్యవస్థకు కనెక్ట్‌ అయిన వైద్యులందరికీ కనిపిస్తాయి. డాక్టర్ల బృందంలో ఎవరో ఒకరు కాల్‌ను స్వీకరించి, కాల్‌ చేసి ఓపీ సేవలు అందిస్తారు. ఆ రోగికి నిర్వహించవలసిన పరీక్షలు, అందించాల్సిన మందులను తెలియజేస్తారు. వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్‌-19 అనుమానిత రోగులను గుర్తిస్తారు. ఆ తర్వాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా చికిత్స వివరాలు రోగికి అందుతాయి. అవసరమైన సందర్భాల్లో వీడియో కన్సల్టేషన్‌ ఉంటుంది. అవసరమైన వారిని ఏ ఆసుపత్రికి పంపించాలన్న దానిపై కూడా వైద్యులు నిర్ణయం తీసుకుని ఆ మేరకు వారిని తరలిస్తారు. కోవిడ్‌-19 అనుమానిత కేసుల జాబితా తయారీ. ఆ రోగులకు అవసరమైన పరీక్షలు, క్వారంటైన్, ఐసొలేషన్‌తో పాటు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) సిద్ధం. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆ జాబితాల రూపకల్పన ఉంటుంది. ఈ జాబితాలను జిల్లా అధికారులకు పంపిస్తారు. తీసుకోవాల్సిన చర్యలన్నీ సక్రమంగా జరిగేలా చూసుకుంటారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యాధికారులకు ప్రిస్కిప్షన్లు పంపిస్తారు. ప్రతి రోగికీ అవసరమైన ఔషధాలను ప్రత్యేకంగా ప్యాక్‌ చేసి.. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, గ్రామ వార్డు వలంటీర్ల ద్వారా రోగులకు నేరుగా ఇంటికే పంపిస్తారు. నాన్‌ కోవిడ్‌ రోగులకు కూడా మందులు అందించే కార్యక్రమం కొనసాగుతుంది. మాస్క్‌ లేకుండా తిరిగితే రూ.500 జరిమానా కరోనావైరస్ వ్యాప్తి నివారించేందుకు ముఖానికి అడ్డుగా మాస్క్ కానీ, చేతి రుమాలు కానీ కట్టుకోవాల్సిందేనని, అలా చేయకుండా బయటతిరిగే వారికి రూ. 500 జరిమానా విధిస్తామని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించినట్లు 'ఆంధ్రజ్యోతి' కథనం రాసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా రూ. 500 జరిమానా విధిస్తామని హరీశ్ రావు చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్‌ కట్టడికి సీఎం కేసీఆర్‌ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కరోనా కట్టడిలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, ఎవరూ ఇళ్లనుంచి బయటకు వెళ్లొద్దని కోరారు. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 48 లక్షల ఎకరాల్లో రైతులు రికార్డు స్థాయిలో వరి పంట సాగు చేశారని తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) కరోనా పాజిటివ్‌గా తేలిన తన మామను రహస్యంగా కలిసివచ్చిన వ్యక్తిపై ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్లు 'ఈనాడు' దినపత్రిక ఓ వార్త రాసింది.